సెక్షన్ 22ఏ: నిషేధిత జాబితాలో ఉన్న భూములను ప్రభుత్వం ఏం చేయబోతోంది?

తెలంగాణలో వివాదాస్పదంగా మారిన రిజిస్ట్రేషన్ యాక్ట్ సెక్షన్ 22ఏ నిషేధిత ఆస్తుల జాబితాపై నూతన విధానం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
''రాష్ట్ర ప్రభుత్వం ఏ భూమినీ కొత్తగా 22ఏ జాబితాలో చేర్చలేదు'' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
ఇకపై ఏ భూమినైనా 22ఏ జాబితాలో చేర్చే ప్రక్రియను ఆర్డీవో లేదా సబ్ కలెక్టర్ మాత్రమే ప్రారంభిస్తారని చెప్పారు.
గత కొన్ని రోజులుగా తెలంగాణలో 22ఏ భూముల జాబితాపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. లక్షలాది ఎకరాలను 22ఏ జాబితాలో పెట్టి ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఎకరా భూమిని కూడా 22ఏ జాబితాలో పెట్టలేదని, గతంలో ఉన్న జాబితానే కొనసాగుతోందని ప్రభుత్వం చెబుతోంది.

ఈ నేపథ్యంలో సెక్షన్ పరిధిలోకి వచ్చే భూములపై దుమారం రేగడంతో పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
మరోవైపు, ఈ విషయంపై మాజీ జాయింట్ కలెక్టర్ సురేష్ పొద్దార్ బీబీసీతో మాట్లాడారు. గ్రామ సభలు ఏర్పాటు చేసి సమస్యకు పరిష్కారం చూపితే బాగుంటుందన్నారు.
ఎన్ని రకాల భూములు.. ఏం చేస్తారంటే..
తెలంగాణ ప్రభుత్వం మొత్తం 12 రకాలుగా భూములను నిషేధిత జాబితాలో ఉన్నట్లు గుర్తించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
- యూఎల్సీ భూములు (పాక్షికంగా క్రమబద్దీకరించిన, క్రమబద్దీకరించని కాలనీలు) – యూఎల్సీ అంటే అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ (పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం). మిగులు భూముల క్రమబద్దీకరణ కోసం ప్రభుత్వం నూతన విధానాన్ని త్వరలోనే ప్రవేశపెట్టనుందని సీఎం ప్రకటించారు.
- ''పెండింగులో ఉన్న పాత దరఖాస్తులతోపాటు కొత్త దరఖాస్తులన్నింటికీ ఇది వర్తిస్తుంది. భూముల రిజిస్ట్రేషన్, క్రమబద్దీకరణ.. రెండింటినీ ఏకకాలంలో చేపడతాం'' అని చెప్పారు.
- ఆథరైజ్డ్ లే అవుట్లలోని ప్రభుత్వ భూములు – హెచ్ఎండీఏ లేదా జీహెచ్ఎంసీ లేదా డీటీసీపీ ఆమోదించిన లే అవుట్లలో పెండింగులో ఉన్న రిజిస్ట్రేషన్ దరఖాస్తులను పరిశీలించి వారం రోజుల్లో సమగ్ర వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.
- సింగరేణి బొగ్గు గని ప్రాంతాల సమస్య – దీని పరిష్కారానికి ప్రభుత్వం జిల్లా స్థాయి ఉన్నతాధికార కమిటీని ఏర్పాటు చేస్తుంది. పెండింగులో ఉన్న అన్ని దరఖాస్తులనూ కమిటీ సమగ్రంగా పరిశీలించి, నిర్దేశిత అర్హతా ప్రమాణాల మేరకు పరిష్కరిస్తుందని సీఎం చెప్పారు.
- జీవో నం.59 – భూముల క్రమబద్దీకరణ కోసం గతంలో ప్రభుత్వం జీవో నం.59 తీసుకువచ్చింది. దీనికింద వచ్చిన 1,22,280 దరఖాస్తులను నిర్దేశిత అర్హత ప్రాతిపదికన తుది పరిశీలన చేసి పరిష్కరించేందుకు కమిటీ ఏర్పాటు చేయనుందని సీఎం ప్రకటించారు. అలాగే మరో 18,590 పెండింగు దరఖాస్తులను నూతన క్రమబద్దీకరణ విధానం ద్వారా పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.
- జీవో నం.118 – ఈ సమస్య పూర్తిగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉంది. క్రమబద్దీకరణ కోసం జీవో నం.118 కింద చేసుకున్న దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. వీటిని నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని ప్రభుత్వం చెబుతోంది.
- అసైన్డ్ భూములలో నిర్మించిన ఇళ్లు – ఈ విషయంపై సమగ్ర న్యాయ సమీక్ష, విస్తృత స్థాయి సంప్రదింపులు జరుపుతామని ప్రభుత్వం ప్రకటించింది.
- ఇందిరమ్మ పథకం – ఇవి రెండు కేటగిరీలలో ఉన్నాయి. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయంతో నిర్మించిన ఇళ్లు ఇందిరమ్మ పథకం కిందకు వస్తాయి. దీనిపై విసృత స్థాయి సంప్రదింపులు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. లబ్ధిదారుని సొంత స్థలంలో ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయంతో నిర్మించిన ఇళ్లు రెండో కేటగిరీ కిందకు వస్తాయి. వీటికి ఐదు సంవత్సరాల తర్వాతే క్రయవిక్రయాలకు అనుమతిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.
- నాలా రుసుములు చెల్లించని ప్రైవేటు పట్టాభూములు - వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు వినియోగించేందుకు నాలా (నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్) యాక్ట్ కింద నిర్దేశిత రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. నాలా ఛార్జీలు చెల్లించాక స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుములు కలిపి కడితే క్రయవిక్రయాలకు అనుమతి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.
- ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు, అనధికార లేఅవుట్లు - ఈ తరహా లే అవుట్లను రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించి నూతన క్రమబద్దీకరణ పథకం పరిధిలోకి తీసుకురానున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు.
- సికింద్రాబాద్ పరిధిలోని లీజ్ హోల్డ్ ఆస్తుల ఫ్రీ హోల్డ్ క్రమబద్దీకరణ - ఈ సమస్య పరిష్కారానికి 30 రోజుల్లోగా అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పింది.
- స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికుల అసెన్మెంట్ భూములు, భూదాన్ భూములు – ఈ భూములను ల్యాండ్ పూలింగ్ స్కీం పరిధిలోకి తీసుకువచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలోని బలహీనవర్గాల గృహ నిర్మాణ పథకాలకు వినియోగిస్తామని సీఎం ప్రకటించారు.

అసలు 22ఏ నిషేధిత జాబితా అంటే..
రిజిస్ట్రేషన్ల చట్టంలోని 'సెక్షన్ 22ఏ' ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా భూమిని ఎవరూ కొనకుండా, అమ్మకుండా నిషేధించగలదు.
ఆ భూమి రిజిస్టర్డ్ పత్రం ద్వారా బదిలీ కాదు. ఉదాహరణకు, ఒక సర్వే నంబరులో గల భూమిని ఈ 22ఏ జాబితాలో చేరిస్తే, ఇక ఆ సర్వే నంబరులో భూ లావాదేవీలన్నీ నిలిచిపోతాయి. అమ్మకం, కొనుగోలు, పవర్ ఆఫ్ అటార్నీ, తాకట్టు, గిఫ్ట్ డీడ్.. ఏదీ ఉండదు.
2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ సెక్షన్ను అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చింది.
అయితే, ఈ సెక్షన్ కింద భూముల సమస్యను పరిష్కరించేందుకు గ్రామాల వారీగా జాబితాను ప్రచురిస్తే ప్రజలకు అవగాహన వస్తుందని సురేష్ పొద్దార్ బీబీసీతో చెప్పారు.
''సెక్షన్ 22ఏ కింద పెట్టిన నిషేధిత జాబితా భూముల సమస్యను కలెక్టర్ స్థాయిలో పరిష్కరించేందుకు వీలుంది. తహసీల్దారు నుంచి నివేదికను తెప్పించుకుని, ఆర్డీవో, అదనపు కలెక్టర్ సమీక్ష ద్వారా భూములను నిషేధిత జాబితాలో కలెక్టర్ చేరుస్తారు. అదే విధంగా పరిష్కారం కూడా కలెక్టర్ స్థాయిలో చూపాలి'' అని చెప్పారు.

22ఏ లో తెలంగాణలో ఎన్ని భూములున్నాయంటే..
2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేనాటికి వివిధ రకాల భూములు కలుపుకొని సెక్షన్ 22ఏలో ప్రభుత్వ, ప్రైవేటు భూములు కలుపుకొని 1,02,52,690 ఎకరాలు ఉన్నట్లుగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సెప్టెంబరు 12న అసెంబ్లీలో ప్రకటించారు.
2026 ఆగష్టు 31 నాటికి 1,02,05,250 ఎకరాలు... అంటే 47,440 ఎకరాలు తగ్గాయని చెప్పారు.
''ధరణి వచ్చిన తర్వాత తయారుచేసిన 22ఏ జాబితాను హైకోర్టు ఆదేశాల మేరకు 2025 డిసెంబర్ 3న ఆన్లైన్లో అప్లోడ్ చేసే సమయంలో పొరపాటు జరిగింది. దాన్ని సరిదిద్దాం'' అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
22ఏ సెక్షన్ వివాదం రేగిన తర్వాత ప్రభుత్వం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటుచేసింది. ఆగస్టు 18న ఇది అందుబాటులోకి వచ్చింది.
''మొదటి రోజున 117 కాల్స్ వచ్చాయి. ఆగస్టు 19న 198, 20న 189, 21న 369, 22న 304, 24న 317 కాల్స్ వచ్చాయి. అయితే, ఆగస్టు 24 తర్వాత కాల్స్ సంఖ్య క్రమంగా తగ్గుతూ సెప్టెంబర్ 7 నాటికి 56కు తగ్గింది'' అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా గతేడాది ఆగస్టు నెలతో పోల్చితే ఈ ఏడాది ఆగస్టులో పెరిగిందని మంత్రి చెప్పారు.

ఫొటో సోర్స్, X/KTR
బీఆర్ఎస్ ఏమంటోంది?
22ఏ కింద లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
''22ఏ అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వం సరైన సమాధానం ఇస్తుందని ఆశించాం. రెవెన్యూ శాఖ మంత్రి కేవలం 'సారీ'తో సరిపెట్టారు. తప్పు చేసింది అధికారులు కాదు.. ప్రభుత్వమే. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా అధికారులపై నెపం నెట్టడం సరికాదు" అని కేటీఆర్ అన్నారు.
కాలనీలు, అపార్ట్మెంట్లు, ఇళ్లను నిషేధిత జాబితాలో చేర్చినట్లయితే వాటిని బేషరతుగా తొలగించాలని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)




























